
కథ బావుంటే భాషతో సంబంధంతో లేకుండా ఏ సినిమానైనా ప్రేక్షకులు ఆరాధిస్తారని టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్ నటించిన రెండు చిత్రాలు నిరూపించాయి. తెలుగులో మంచి విజయం సాధించిన చిత్రాలను హిందీలో డబ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసే విషయం తెలిసిందే. ఇదే విధంగా బన్నీ నటించిన ‘సరైనోడు’, ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రాల హిందీ డబ్బింగ్ వర్షన్లలను య్యూటూబ్లో అప్లోడ్ చేయగా పలు కారణాల వల్ల య్యూట్యూబ్ వాటిని తొలగించింది. కొంతకాలం తర్వాత మళ్లీ వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు. గోల్డ్మైన్స్ టెలీఫిల్మ్స్ సంస్థ అధికారికంగా పోస్ట్ చేసిన ‘సరైనోడు’ సినిమాను 20కోట్ల మంది, ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రాన్ని 15 కోట్ల మంది వీక్షించారు. దీంతో బన్నీకి బాలీవుడ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అంతేకాదు య్యూటూబ్లో అత్యధిక వ్యూస్ సాధించిన భారత చలన చిత్రాలుగా బన్నీ సినిమాలు నిలిచాయి. రెండు స్థానాల్లో అల్లు అర్జున్ సినిమాలే ఉండటం విశేషం. మూడో స్థానంలో రామ్ నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రం నిలించింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు. ‘ దేశ వ్యాప్తంగా నా సినిమాలు చూసిన వారందరికీ ధన్యవాదాలు. భవిష్యత్తులో మరిన్ని చిత్రాలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి మీ ప్రేమను అందుకుంటానని భావిస్తున్నాను’ అని పేర్కొన్నాడు.