బాలీవుడ్లో పలు చిత్రాలు నిర్మించిన ప్రముఖ సంస్థ 'వయాకామ్ 18 మీడియా `దేవదాస్` చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. వైజయంతీ మూవీస్ సంస్థతో కలిసి `దేవదాస్` చిత్రాన్ని విడుదల చేయబోతోంది. నాగార్జున - నాని కథానాయకులుగా నటించిన మల్టీస్టారర్ చిత్రం `దేవదాస్`. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణారంతర కార్యక్రమాల్లో ఉంది. నిర్మాత అశ్వినిదత్ మాట్లాడుతూ "వయా కామ్ 18 తో భాగస్వామి కావడం చాలా ఆనందంగా ఉంది. వారితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాం.`` అన్నారు. వయా కామ్ 18 సీఓఓ అజిత్ అంధారే మాట్లాడుతూ "భారీ చిత్రం 'దేవదాస్' తో తెలుగు చిత్రసీమ లో కి ప్రవేశిస్తున్నందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. మా సంస్థని తెలుగులో అనేక దశాబ్దాల అనుభవం ఉన్న నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ భాగస్వామ్యంతో మరింతగా విస్తరించేందుకు కృషి చేస్తాం`` అన్నారు. రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.