
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సెట్లో తమిళ నటుడు జయరామ్ ప్రభాస్తో కలిసి ఓ సెల్ఫీ దిగారు. ప్రస్తుతం ఈ సెల్ఫీ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరలౌతోంది. ఇందులో ప్రభాస్ చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నారు. ఇక జయరామ్ కూడా మీసాలు పెంచి అదరహో అనిపించేటట్లు ఉన్నారు. మలయాళ నటుడు జయరాం తెలుగులో ఆ మధ్య ‘భాగమతి’, ‘అల వైకుంఠాపురములో’ వంటి చిత్రాలలో నటించి అలరించారు. యూరోపియన్ ప్రేమకథా నేపథ్యంలో పీరియడ్ లవ్ స్టోరీగా వస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. సినిమాలో ప్రభాస్ ఫార్చ్యూన్ టెల్లర్ పాత్రను పోషిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. పూజా హెగ్డే ఒక యువరాణి పాత్రలో అలరించనుందని చెప్పుకుంటున్నారు. ఇక జయరామ్ సైతం చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కానీ అది ఎలాంటి పాత్ర అనేది తెలియదు. చిత్రంలో భాగ్యశ్రీ, ప్రియదర్శి పులికొండ, మురళీశర్మ, కునాల్ రాయ్ కపూర్ తదితరులు నటిస్తున్నారు. యువి క్రియేషన్స్, టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు.
