యువ కథానాయకుడు నాగశౌర్య వరుస చిత్రాలతో జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా ‘వరుడు కావలెను’, ‘లక్ష్య’ చిత్రాలు సెట్స్పై ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. ఇవి కాక.. ఆయన ఇటీవలే అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకారం తెలిపారు. ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. షర్లీ సేతియా కథానాయిక. ఈ చిత్రం శుక్రవారం నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకుందని సమాచారం. ఓ చక్కటి కుటుంబ కథాంశంతో ఈ చిత్రాన్ని ముస్తాబు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం కోసం ‘శ్రీకృష్ణ - సత్యభామ’ అనే ఆసక్తికర టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగని ఇదేమీ పౌరాణికం కాదు. నేటి తరానికి తగ్గ కథతో రూపొందుతోన్న చిత్రమే. అయితే నాయకా నాయికల పాత్రలు శ్రీకృష్ణ - సత్యభామలను పోలి ఉంటాయని తెలిసింది. సంగీతం: మహతి స్వరసాగర్, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్, సమర్పణ: శంకర్ ప్రసాద్ ముల్పూరి.